NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 7:13 pm Posted by : NAMASTHE BHARAT

ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి

ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి

*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచన*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్27:రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు, 18వ వార్డుల్లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి ప్రతినిధులు (బీఎల్‌ఏలు)తో మాట్లాడి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో నుంచి తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి బసవేశ్వర్, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కౌన్సిలర్లు బచ్చలి నరేష్, సంతోషి బాయి చందులాల్, రాజు నాయక్, పెంటయ్య, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖదీర్, సుజీవన్, పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, మహ్మద్ ఇబ్రహీం, తుపాకుల శేఖర్, ముబారక్ అలీ ఖాన్, భాగ్యలక్ష్మి, కత్తి చంద్రశేఖరప్ప, శంకర్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.