మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
హౌస్ ట్యాక్స్ భారాన్ని తగ్గించాలి – మోడల్ మార్కెట్ను ప్రారంభించాలి – డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలి
ఎం.డి. అబ్దుల్ రషీద్ మహబూబాబాద్ జిల్లా
సిపిఐ జిల్లా సమితి సభ్యులు
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ డిమాండ్ చేశారు.మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో సామాన్య ప్రజలపై హౌస్ ట్యాక్స్/ప్రాపర్టీ ట్యాక్స్ భారం అధికంగా ఉందని, పన్ను విధానాన్ని సమగ్రంగా పునఃపరిశీలించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.ఇతర.మున్సిపాలిటీల్లో అమలవుతున్న పన్ను విధానాలతో పోల్చి, మరిపెడ బంగ్లాలో పన్నుల విధానాన్ని పారదర్శకంగా సమీక్షించాలని అన్నారు.సీసీ రోడ్ల సమస్య పరిష్కరించాలి
మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులు, కాలనీలు, అంతర్గత వీధుల్లో సీసీ రోడ్లు లేకపోవడం, ఉన్న రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి కొత్త సీసీ రోడ్లు నిర్మించాలని, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి
మరిపెడ బంగ్లా పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు నీరు నిలిచిపోతోందని, దుర్వాసన, దోమల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పట్టణంలోని డ్రైనేజీలను పూర్తిస్థాయిలో పరిశీలించి పూడిక తొలగించడంతో పాటు, అవసరమైన చోట కొత్త డ్రైనేజీలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
అంగడి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలి
మరిపెడ బంగ్లా అంగడి ఆవరణలో చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాపారులు, రైతులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎం.డి. అబ్దుల్ రషీద్ తెలిపారు. అంగడి ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రం చేయించి, చెత్తను వెంటనే తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మోడల్ మార్కెట్ను వెంటనే ప్రారంభించాలి
ప్రజాధనంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మోడల్ మార్కెట్ను వెంటనే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ను మోడల్ మార్కెట్లోకి తరలించి, రైతులు, కూరగాయల వ్యాపారులు,వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.మోడల్ మార్కెట్ నిర్మాణానికి ప్రజాధనం ఖర్చు చేసిన నేపథ్యంలో దానిని నిరుపయోగంగా ఉంచకుండా వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.మరిపెడ బంగ్లా మండలంలోని ప్రజల సమస్యలను ఎంపీడీవో, ఎంఆర్ఓ (తహసీల్దార్), మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని ఎం.డి. అబ్దుల్ రషీద్ కోరారు.
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మార్కెట్ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేశారు.