వీరాపురం ఇసుక రీచ్ వివాదాన్ని పరిష్కరించి రెండు గిరిజన సొసైటీలకు సమన్యాయం చేయాలి
– జిల్లా కలెక్టర్ను కలిసిన తుడుం దెబ్బ నాయకులు
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వీరాపురం ఇసుక రీచ్కు సంబంధించి రెండు గిరిజన సహకార సంఘాల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించి, ప్రభుత్వం ఆమోదించిన ఇసుక క్వాంటిటీని సమన్యాయ పద్ధతిలో పంపిణీ చేయాలని కోరుతూ తుడుం దెబ్బరాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తి రాజుఆదివాసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ వాసం రామకృష్ణ దొర ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వీరాపురం ఇసుక రీచ్ విషయంలో రెండు గిరిజన సహకార సంఘాలు తమ హక్కులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అన్ని పక్షాలను పిలిచి నిష్పాక్షికంగా విచారణ నిర్వహించాలని కోరారు. గిరిజన మహిళల జీవనోపాధి, గ్రామాల సామాజిక ఐక్యత మరియు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, ఇప్పటికే ఆమోదించబడిన ఇసుక క్వాంటిటీ విషయంలో గిరిజనుల మధ్య విభేదాలు మరింత పెరగకుండా, రెండు సంఘాలకు సముచిత న్యాయం జరిగే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు సొసైటీలకు సమాన అవకాశం కల్పించి, పారదర్శకంగా విచారణ జరిపి న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మరోసారి స్పష్టం చేస్తూ, కొంతమంది వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఆదివాసుల మధ్య చిచ్చుపెట్టి విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు. గిరిజన సమాజాన్ని రెండు వర్గాలుగా విడదీసి గొడవలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే చర్యలను తీవ్రంగా ఖండించారు. ఆదివాసుల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారు వెంటనే తమ చర్యలను విరమించుకోవాలని హెచ్చరించారు. గిరిజన సమాజం శాంతి, సామరస్యం పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని, సమస్యలను చట్టబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. వీరాపురం ఇసుక రీచ్ అంశంలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగం తక్షణ జోక్యం చేసుకొని, రెండు గిరిజన సొసైటీలకు సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గిరిజన నాయకులు కోరారు.