మైనర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు.
‘కొప్టా’, ‘జెజె’ యాక్ట్ కింద కేసులు నమోదు
ఇన్స్పెక్టర్ (ఎస్సై) గండ్రాతి సతీష్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని పలు పాన్ షాపులపై గురువారం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) గండ్రాతి సతీష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వ్యాపారాలను, నిషేధిత పదార్థాల విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న పాన్ షాపులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్సై, నిషేధిత గుట్కా, ఖైనీ, ఇతర మత్తు పదార్థాల నిల్వలు మరియు విక్రయాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎస్సై గండ్రాతి సతీష్ మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా నిషేధిత వస్తువులను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా కొంతమంది వ్యాపారులు మైనర్లకు (చిన్నారులకు) కూడా ఇటువంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. మైనర్లకు వీటిని అమ్మినట్లు రుజువులు ఉండటంతో సదరు వ్యాపారులపై కొప్టా యాక్ట్ మరియు జెజె యాక్ట్ జువైనల్ జస్టిస్ చట్టం) కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.యువత మరియు చిన్నారుల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని నాశనం చేసే ఇలాంటి పదార్థాల విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు మరిపెడ పట్టణ వ్యాప్తంగా ఈ ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఎస్సైతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.