NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 10:07 am Posted by : NAMASTHE BHARAT

మాదకద్రవ్యాలకు దూరంగా.. ఆరోగ్యకర భారత నిర్మాణమే లక్ష్యం

మాదకద్రవ్యాలకు దూరంగా.. ఆరోగ్యకర భారత నిర్మాణమే లక్ష్యం

నషా ముక్త్ భారత్ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

యువతకు అవగాహన కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం

జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం: జిల్లా సంక్షేమ అధికారి శారద

కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “నషా ముక్త్ భారత్ అభియాన్” ప్రధాన లక్ష్యమని మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల సందర్భంగా జిల్లా సమగ్ర అభివృద్ధి కార్యాలయం (ఐడీఓసీ)లో గురువారం నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ భవిష్యత్తైన యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థ, సామాజిక జీవనంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. యువతలో అవగాహన పెంపొందించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి శారద మాట్లాడుతూ, నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత, ప్రజలు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టి మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, యువతను సన్మార్గంలో నడిపించేందుకు సమాజం ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.