NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 2:27 pm Posted by : NAMASTHE BHARAT

శంబిపూర్‌లో పారిశుద్ధ్య సమస్యలకు చెక్.. క్షేత్రస్థాయిలో డిప్యూటీ కమిషనర్ పర్యటన

శంబిపూర్‌లో పారిశుద్ధ్య సమస్యలకు చెక్.. క్షేత్రస్థాయిలో డిప్యూటీ కమిషనర్ పర్యటన

-వన్ డే–వన్ వార్డ్’లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి వేగం

-చెత్త తొలగింపు, డ్రైనేజీ శుభ్రతపై అధికారుల ప్రత్యేక దృష్టి

-రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు తప్పవు: డిప్యూటీ కమిషనర్ హెచ్చరిక

-శంబిపూర్‌లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్

-పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి పునాది.. ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు

దుండిగల్, జులై 6 ( నమస్తే భరత్); దుండిగల్ సర్కిల్ పరిధిలోని శంబిపూర్ గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వన్ డే–వన్ వార్డ్’ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేయించారు. గుర్తించిన గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను (GVP) పూర్తిగా తొలగించి, తిరిగి అక్కడ చెత్త వేయకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే డ్రైనేజీలను శుభ్రం చేయించడం, రోడ్ల స్వీపింగ్ పనులను అధికారుల సమక్షంలో నిశితంగా పర్యవేక్షించారు. అనంతరం స్థానికులతో మాట్లాడిన డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్ పారిశుద్ధ్య పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛ ఆటోలు అందుబాటులో ఉన్నందున తడి, పొడి చెత్తను వేర్వేరుగా వాటిలోనే వేయాలని సూచించారు. రోడ్ల పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలతో పాటు జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. పరిశుభ్రమైన గ్రామ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డిప్యూటీ ఇంజనీర్ అన్వేష్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ అశోక్ కుమార్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ సాత్విక్‌తో పాటు సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.