బస్సు ఢీకొని ఆర్టీసీ మెకానిక్ మృతి
జీడిమెట్ల బస్డిపోలో విషాద ఘటన
గ్యారేజీ పిట్లో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదం
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతుడి భార్య ఫిర్యాదు
జీడిమెట్ల, ఆగస్టు 11: ( నమస్తే భరత్ ); జీడిమెట్ల ఆర్టీసీ బస్డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్యారేజీ పిట్లో బస్సు మరమ్మతు పనులు నిర్వహిస్తున్న మెకానిక్ను అదే బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మండలానికి చెందిన మదన సంతోష్ (40) జీడిమెట్ల బస్డిపోలో మెకానిక్గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం మొదటి షిఫ్ట్ విధులకు హాజరయ్యారు. సుమారు ఉదయం 6.30 గంటల సమయంలో బస్సు నంబర్ TS 09 Z 0129కు సంబంధించిన గ్యారేజీ పిట్లో సంతోష్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వెనుక నుంచి ఢీకొన్న బస్సు
ఫిర్యాదు ప్రకారం.. సదరు బస్సు డ్రైవర్ శ్రీ కృష్ణారావు (స్టాఫ్ నంబర్ 215563) ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా, భద్రతా నిబంధనలు పాటించకుండా బస్సును ముందుకు నడిపినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో బస్సు బంపర్ సంతోష్ తల వెనుక భాగం, ఛాతీకి బలంగా తగిలినట్లు తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.
భార్యకు సహోద్యోగి సమాచారం
ప్రమాదం జరిగిన విషయాన్ని సంతోష్తో కలిసి పనిచేస్తున్న మెకానిక్ గోపాల్ (స్టాఫ్ నంబర్ 217681) ఫోన్ ద్వారా ఆయన భార్య ధనశ్రీకి సమాచారం అందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఆమె జీడిమెట్ల బస్డిపోకు చేరుకున్నారు. అక్కడ తన భర్త తీవ్ర గాయాలతో మృతిచెంది ఉండటాన్ని చూసినట్లు తెలిపారు.
కేసు నమోదు.. దర్యాప్తు
మృతుడి భార్య డి. ధనశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, డ్రైవర్ నిర్లక్ష్యం, డిపోలో భద్రతా చర్యలు పాటించారా? తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మెకానిక్ ప్రాణాలు కోల్పోవడంతో సహచర ఉద్యోగుల్లో విషాదం నెలకొంది. డిపోలో పనిచేసే సిబ్బంది భద్రతకు అవసరమైన అన్ని చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.