NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 9:13 pm Posted by : NAMASTHE BHARAT

సికింద్రాబాద్–శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌కు భూములిచ్చిన రైతులకు రూ.33 కోట్ల పరిహారం

సికింద్రాబాద్–శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌కు భూములిచ్చిన రైతులకు రూ.33 కోట్ల పరిహారం

➤ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

➤ అల్వాల్‌లో 2,264 చదరపు గజాల భూమి ఇచ్చిన యజమానులకు పరిహారం అందజేత

➤ ప్రత్యేక భూసేకరణ అధికారి మాలతి సమక్షంలో కార్యక్రమం

➤ భూసేకరణ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని అధికారుల స్పష్టం

➤ సర్వే నంబర్–168 భూమిపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి

➤ ఆధారాలు లేని వార్తలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని హెచ్చరిక

కుత్బుల్లాపూర్, ఆగస్టు 5 ( నమస్తే భరత్ ): సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మించనున్న ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్ (రాజీవ్ రహదారి) ప్రాజెక్టుకు భూములు సమకూర్చిన అల్వాల్ భూయజమానులకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బుధవారం పరిహార చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక భూసేకరణ అధికారి (డీఆర్‌ఓ) మాలతి సమక్షంలో మొత్తం రూ.33 కోట్ల పరిహారాన్ని భూయజమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సికింద్రాబాద్–శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా అల్వాల్ ప్రాంతంలో 2,264 చదరపు గజాల భూమిని చట్టబద్ధమైన విధానాల ప్రకారం సేకరించి, అర్హులైన భూయజమానులకు నిబంధనల మేరకు పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రత్యేక భూసేకరణ అధికారి మాలతి మాట్లాడుతూ, అల్వాల్ ప్రాంత భూసేకరణకు సంబంధించి ఇటీవల కొన్ని వర్గాలు అసత్య ప్రచారాలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా సర్వే నంబర్–168 భూమికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రికార్డులు, చట్టబద్ధమైన భూసేకరణ ప్రక్రియలను పక్కనబెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలు ప్రచారం చేయవద్దని ఆమె సూచించారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, వాస్తవాలను నిర్ధారించకుండా వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.