NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 6:39 pm Posted by : NAMASTHE BHARAT

ఉప్పరిగడ్డ పంచాయతీ అభివృద్ధి పనులకు అధికారుల ప్రశంసలు

ఉప్పరిగడ్డ పంచాయతీ అభివృద్ధి పనులకు అధికారుల ప్రశంసలు

నాణ్యతతో నిర్మాణాలు చేపడుతున్న సర్పంచ్ చందు నాయక్

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ వ్04:ఫరూక్‌నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు చేపడుతున్న సర్పంచ్ చందు నాయక్‌ను పంచాయతీరాజ్ శాఖ అధికారులు అభినందించారు.సోమవారం పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, ఏఈ గోపాల్ గ్రామాన్ని సందర్శించి రూ.20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవన పనులను పరిశీలించారు. నిర్మాణంలో స్టీల్, సిమెంట్, ఇసుక వంటి నాణ్యమైన నిర్మాణ సామగ్రిని వినియోగిస్తూ ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా పనులు కొనసాగిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇదే విధంగా అన్ని ప్రభుత్వ నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.అనంతరం గ్రామంలో కొత్తగా చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అయ్యవారిపల్లి నుంచి జయరాం తండా వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను కూడా అధికారులు పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కల్వర్టుల నిర్మాణం, భూసేకరణ అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పట్టా భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.సర్పంచ్ చందు నాయక్ మాట్లాడుతూ, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని, రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీలత తిరుపతయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.