NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 9:32 am Posted by : NAMASTHE BHARAT

వెంకన్నహిల్స్‌లో ప్రజా సమస్యలపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

వెంకన్నహిల్స్‌లో ప్రజా సమస్యలపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ సమస్యలపై నివాసితుల వినతి

వర్షపు నీటి నిల్వతో రోడ్లు, కమ్యూనిటీ హాల్‌లో ఇబ్బందులు

సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన జీహెచ్‌ఎంసీ, మంజీరా, విద్యుత్ శాఖ అధికారులు

త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామని డిప్యూటీ కమిషనర్ హామీ

కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెంకన్నహిల్స్ కాలనీలో నెలకొన్న పలు ప్రజా సమస్యలపై జీడిమెట్ల జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, విద్యుత్ అంతరాయాలు, వర్షాకాలంలో రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండటం వంటి సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జీడిమెట్ల డిప్యూటీ కమిషనర్ శంకర్ సింగ్, ఏఎంఓహెచ్ డాక్టర్ కవిత, డీఈ బాలమురళి, ఏఈ ఆభిరామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్, మంజీరా విభాగం అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది కాలనీలో పర్యటించి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వర్షాకాలంలో కాలనీలోని పలు రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివాసితులు అధికారులకు వివరించారు. అలాగే కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వర్షపు నీరు చేరి నిల్వ ఉండటంతో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. మంజీరా మంచినీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలు, విద్యుత్ సంబంధిత ఇబ్బందులను అధికారులు పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. వెంకన్నహిల్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కాలనీలోని ప్రధాన సమస్యలను అధికారులకు వివరించి, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచి, అవసరమైన చర్యలను త్వరితగతిన చేపడతామని జీడిమెట్ల డిప్యూటీ కమిషనర్ శంకర్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో వెంకన్నహిల్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.