NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 11:32 am Posted by : NAMASTHE BHARAT

నిజాంపేట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కె.పి. వివేకానంద సమగ్ర సమీక్ష

నిజాంపేట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కె.పి. వివేకానంద సమగ్ర సమీక్ష

-చెరువుల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై అధికారులకు కీలక ఆదేశాలు

-తుర్క చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశం

-పత్తికుంట, మేడికుంట, అంబీర్ చెరువుల పనులు త్వరగా ప్రారంభించాలని సూచన

-యూడీజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనులపై ప్రత్యేక సమీక్ష

-2బీహెచ్‌కే కాలనీల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం

-పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమన్న ఎమ్మెల్యే

-ప్రజలకు మెరుగైన సేవలే అధికారుల ప్రధాన లక్ష్యమని స్పష్టం

కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బి.ఆర్.ఎస్.ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద అన్నారు. గురువారం ప్రగతి నగర్‌లోని నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సర్కిల్ పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణ, పరిరక్షణ చర్యలపై ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తుర్క చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పత్తికుంట, మేడికుంట, అంబీర్ చెరువుల అభివృద్ధి పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. కొత్త వీధి దీపాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న దీపాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అలాగే 2బీహెచ్‌కే గృహ సముదాయాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నిజాంపేట్ సర్కిల్ ఉప కమిషనర్ షబ్బీర్ అలీ, డిప్యూటీ తహశీల్దార్ ఉమామహేశ్వర రెడ్డి, ఇరిగేషన్ డీఈ రూప్ లాల్, వీరారెడ్డి, ఏఈ రవి, ఇంజినీరింగ్ శాఖ, జలమండలి శాఖ అధికారులు, నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, అధ్యక్షుడు రంగారాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.