ఉప్పల్ అభివృద్ధికి రూ.76.46 కోట్ల భారీ వరం

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా నాలుగు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
➤ రూ.76.46 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, క్రీడా వసతులు, ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం
➤ రామంతాపూర్, చెర్లపల్లి, చిలకనగర్, బీరప్పగడ్డ ప్రాంతాల్లో విస్తృత అభివృద్ధి పనులు
➤ వర్షపు నీటి పారుదల వ్యవస్థ బలోపేతంతో ప్రజలకు శాశ్వత ఉపశమనం లక్ష్యం
➤ మల్టీ స్పోర్ట్స్ అరేనా, ఆధునిక జిమ్, ఫుట్పాత్లు, బస్స్టాప్ల అభివృద్ధికి ప్రాధాన్యం
➤ నాణ్యత, పారదర్శకతతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
➤ ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా రూ.76.46 కోట్ల ప్రాజెక్టులు
కుత్బుల్లాపూర్, జూలై 30 (నమస్తే భరత్ ): ఉప్పల్ నియోజకవర్గాన్ని ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ.76.46 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే రహదారులు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, క్రీడా మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి (ఐఏఎస్), మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి (ఐఏఎస్), ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా (ఐఏఎస్), కీసర ఆర్డీఓ, ఎంఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు, డిప్యూటీ కమిషనర్ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రామంతాపూర్లో క్రీడా వసతుల విస్తరణ
రామంతాపూర్లోని భజరంగ్ వ్యాయామశాల అభివృద్ధికి రూ.90 లక్షలతో గ్రౌండ్ ఫ్లోర్ విస్తరణ, బోర్వెల్ ఏర్పాటు, ఆధునిక జిమ్ పరికరాల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయిన తర్వాత యువతకు అత్యాధునిక క్రీడా శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
రూ.56.35 కోట్లతో భారీ మౌలిక వసతులు
రామంతాపూర్ భాగాయత్–ఉప్పల్ ప్రాంతంలో రూ.56.355 కోట్లతో ప్రధాన స్టార్మ్ వాటర్ డ్రైన్లు, ఫుట్పాత్లు, మల్టీ స్పోర్ట్స్ అరేనా, పలు కాలనీల్లో సీసీ రోడ్లు, వి.టి. కమాన్ వద్ద బస్స్టాప్ అభివృద్ధి తదితర పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో వర్షపు నీటి పారుదల వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా, క్రీడా సౌకర్యాలు అందనున్నాయి.
బొడ్రాయి–చిలకనగర్–బీరప్పగడ్డలో అభివృద్ధి
రూ.3.23 కోట్లతో దెబ్బతిన్న సీసీ రోడ్ల మరమ్మతులు, స్టార్మ్ వాటర్ డ్రైన్ల పునర్నిర్మాణం, రిటైనింగ్ వాల్, స్టీల్ గిర్డర్ వంతెన నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి, రహదారుల విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
చెర్లపల్లిలో రూ.15.97 కోట్ల పనులు
చెర్లపల్లి, వాంపుగూడ, కాప్రా ప్రాంతాల్లో కల్వర్టుల పునర్నిర్మాణం, విస్తరణ, టెర్షియరీ స్టార్మ్ వాటర్ డ్రైన్లు, ఆర్సీసీ పైప్లైన్లు, సీసీ రోడ్లు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి పనులను రూ.15.97 కోట్లతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన పట్టణ మౌలిక వసతులు, ఆధునిక పౌర సేవలు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, క్రీడా మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయని తెలిపారు. అభివృద్ధి పనులను అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, పూర్తి పారదర్శకతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రూ.76.46 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులు ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.