NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 10:03 pm Posted by : NAMASTHE BHARAT

ఖానాపురంలో ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణి

ఖానాపురంలో ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణి

ఖానాపురం ఆగష్టు17(నమస్తే భారత్ మల్లేష్ ) : ఖానాపురం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. మండల స్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు, సమస్యల పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజావాణి కార్యక్రమానికి 18 మంది మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 20 వినతులు అందగా, వాటిలో పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్, గృహ నిర్మాణం, ఐసీడీఎస్ తదితర అంశాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అదనంగా చేయూత పెన్షన్లకు సంబంధించి 8 దరఖాస్తులు స్వీకరించారు.
ప్రజలకు సాదర స్వాగతం పలికేందుకు తాటాకు పందిరి, రంగవల్లులు ఏర్పాటు చేశారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్, ఆరోగ్య సంబంధిత సేవల కోసం హెల్త్‌డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్‌డెస్క్‌ను పంచాయతీ కార్యదర్శులు, హెల్త్‌డెస్క్‌ను ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు నిర్వహించారు.
ప్రజల సౌకర్యార్థం తాగునీరు, నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు, వినతులు సమర్పించేందుకు వచ్చిన ప్రజలకు లోపల, బయట ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు.మండల స్థాయి ప్రజావాణి ప్రధాన లక్ష్యం ప్రజలు జిల్లా కేంద్రాలు లేదా ఇతర కార్యాలయాల చుట్టూ తిరగకుండా మండల స్థాయిలోనే అన్ని శాఖల మండల స్థాయి అధికారుల సమక్షంలో తమ సమస్యలను తెలియజేసి, న్యాయం మరియు ప్రభుత్వ సేవలను సులభంగా పొందేలా చేయడం అని తహాశీల్థార్ రమేష్ ,ఎంపిడీఓ అద్వైత
తెలిపారు.ప్రజావాణిలో అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా సూచించారు.