మొక్కలను నాటి సంరక్షించుకుందాం..
-బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి..
మక్తల్ : గ్రామాల్లోని విద్యార్థులు, యువత, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ తమ వంతు బాధ్యతగా రెండు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ అంగన్ వాడీ కేంద్రం వద్ద మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలను నాటి నీళ్లు పోశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మొక్కలు నాటిన అనంతరం వాటికి నీళ్లను పోసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అంగన్ వాడీ కేంద్రంలోని చిన్నారుల ప్రగతితో పాటు వారికి అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత, అంగన్ వాడీ టీచర్ లక్ష్మి, నాయకులు బాలచంద్రా రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.