చోరీ బైక్లతో చక్కర్లు… వరుస వాహన చోరీల నిందితుడు అరెస్ట్
– బాచుపల్లి పోలీసుల వలలో 25 ఏళ్ల యువకుడు
– రెండు చోరీ ద్విచక్ర వాహనాల స్వాధీనం
– బాచుపల్లి, దుండిగల్లోనూ పాత కేసులు
– కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్కు తరలింపు
కుత్బుల్లాపూర్, జూలై 7 ( నమస్తే భరత్ ): వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన రెండు యమహా ఆర్ఎక్స్-135 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లికి చెందిన లేట్ల ప్రవీణ్ (25), తండ్రి రాములు, ప్రస్తుతం ప్రగతినగర్ ఆర్కేజీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వాహన చోరీలకు పాల్పడుతున్నాడనే విశ్వసనీయ సమాచారంతో బాచుపల్లి క్రైమ్ సిబ్బంది నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు తేలింది. నిందితుడి వద్ద నుంచి క్రైమ్ నంబర్ 603/2026కు సంబంధించిన యమహా ఆర్ఎక్స్-135 (ఏపీ 02 ఎఫ్ 6793), క్రైమ్ నంబర్ 605/2026కు సంబంధించిన యమహా ఆర్ఎక్స్-135 (ఏపీ 01 ఎఫ్ 2675) వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 540/2026, దుండిగల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 1039/2025 కింద కూడా వాహన చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
వాహన చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చోరీ వాహనాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.