NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 12:18 pm Posted by : NAMASTHE BHARAT

విద్యా ప్రమాణాల పెంపే ప్రభుత్వ లక్ష్యం

విద్యా ప్రమాణాల పెంపే ప్రభుత్వ లక్ష్యం
షాపూర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన విద్యా కమిషన్ సభ్యురాలు జ్యోత్స్నా రెడ్డి

-షాపూర్‌నగర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యా పరిస్థితులపై ప్రత్యక్ష పరిశీలన

-విద్యార్థులు, ఉపాధ్యాయులతో మమేకమై విద్యా ప్రగతిపై ఆరా

-మౌలిక వసతులు, బోధన నాణ్యత మెరుగుదలకు పలు సూచనలు

– పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి జెమిని కుమారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు

కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భారత్ ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచడం, విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడమే లక్ష్యంగా విద్యా కమిషన్ సభ్యురాలు జ్యోత్స్నా రెడ్డి గురువారం షాపూర్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, షాపూర్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలల్లోని తరగతి గదులు, మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వ విద్యా సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, విద్యా సదుపాయాలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జ్యోత్స్నా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల విద్యాశాఖ అధికారి జెమిని కుమారి, షాపూర్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్ రెడ్డి, షాపూర్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.