ఇందిరా మహిళా శక్తి పథకాల ప్రభావం.. కాంగ్రెస్లోకి మైనారిటీ మహిళల చేరిక

కైసర్ నగర్ మహిళలకు కాంగ్రెస్ గూటిలో స్వాగతం
బాచుపల్లి కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన చేరికల కార్యక్రమం
మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హన్మంత్ రెడ్డి
సంక్షేమ పథకాల ప్రచారంలో మహిళలు ముందుండాలని పిలుపు
కుత్బుల్లాపూర్, నమస్తే భారత్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కైసర్ నగర్కు చెందిన పలువురు మైనారిటీ మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫరీన్ ఖాన్ ఆధ్వర్యంలో బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మహిళలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యం లేకుండా సమాజాభివృద్ధి సాధ్యం కాదన్నారు. మహిళల సంక్షేమం, స్వయం సాధికారత, ఆర్థిక ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన మహిళలకు అభినందనలు తెలిపిన హన్మంత్ రెడ్డి, ప్రజాసేవలో చురుకుగా పాల్గొని సమాజాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, పార్టీ బలోపేతానికి కూడా మహిళల సహకారం అవసరమని అన్నారు. కైసర్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చేరికలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల చేరికతో కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.



