NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 9:39 pm Posted by : NAMASTHE BHARAT

హైకోర్టు తీర్పు వెంటనే అమలు చేయాలి.. ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్

హైకోర్టు తీర్పు వెంటనే అమలు చేయాలి.. ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్

-జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ భూములపై సీపీఐ డిమాండ్

-ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

-ఆలస్యం వల్ల మిగిలిన భూములు కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదమని హెచ్చరిక

-మే నెలలో హైకోర్టు తీర్పు వచ్చినా చర్యలు చేపట్టలేదని విమర్శ

-ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించాలని ఉమా మహేష్ విజ్ఞప్తి

-ఆలయ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం

జగద్గిరిగుట్ట, జులై 20 (నమస్తే భారత్ ): హైకోర్టు ఆదేశాల మేరకు జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన సుమారు 14 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని ఆలయ ఆధీనంలోకి తీసుకురావాలని సీపీఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆలయ భూములకు సంబంధించి హైకోర్టు మే నెలలో స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు అమలు దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. తీర్పు అమలులో జాప్యం కొనసాగితే మిగిలిన ఆలయ భూములు కూడా ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ ఆస్తులను పరిరక్షించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొంటూ, హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేసి సంబంధిత భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆలయ భూముల రక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ఆక్రమణలను పూర్తిగా అడ్డుకుని ఆలయ ఆస్తులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు ఏసురత్నం, జిల్లా కార్యవర్గ సభ్యుడు శంకర్, కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, బాబు, సదానందం తదితరులు పాల్గొన్నారు.