NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 2:46 pm Posted by : NAMASTHE BHARAT

హరితహారమే భావితరాలకు వరం

హరితహారమే భావితరాలకు వరం

-లయన్స్ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

-కూకట్‌పల్లి బాలాజీనగర్ పార్క్‌లో హరిత సందేశం

-ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని పిలుపు

-పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత: అన్నెం కోటిరెడ్డి

-వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన

ఉత్సాహంగా పాల్గొన్న లయన్స్ సభ్యులు, స్థానికులు

కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్): పర్యావరణ పరిరక్షణే భావితరాలకు మనం అందించగల గొప్ప సంపద అని, ప్రతి ఒక్కరూ వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని లయన్స్ క్లబ్ పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ లయన్ అన్నెం కోటిరెడ్డి పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనాత్‌నగర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కూకట్‌పల్లి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కూకట్‌పల్లి బాలాజీనగర్ కాలనీ పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నెం కోటిరెడ్డి మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలంటే విస్తృతంగా మొక్కలు నాటడం ఒక్కటే శాశ్వత పరిష్కారమని అన్నారు. ప్రతి లయన్స్ సభ్యుడు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా కనీసం ఒక్క మొక్కను నాటి, దానిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. మొక్కలు ఆక్సిజన్ స్థాయిలను పెంచడమే కాకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ ఎక్కింటి వెంకట్‌రెడ్డి, కార్యదర్శి లయన్ శ్రీనివాస్‌రెడ్డి, మునికుమార్, రవీందర్‌రెడ్డితో పాటు లయన్స్ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు. కార్యక్రమం హరిత సందేశాన్ని సమాజానికి చేరవేస్తూ విజయవంతంగా ముగిసింది.