ప్రతి అడుగు అభివృద్ధి వైపు… ప్రతి రోడ్డు ప్రజల ప్రగతి కోసం

పద్మానగర్ డివిజన్లో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ విస్తృత పాదయాత్ర
రూ.28 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డు ప్రారంభం
తాగునీటి లో-ప్రెషర్, మురుగునీటి సమస్యలపై స్థానికులతో ముఖాముఖి
తెలంగాణ చౌరస్తాలో కొత్త డ్రైనేజీ ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు
ప్రజల అవసరాలే అభివృద్ధి ప్రణాళికలకు ప్రాతిపదిక : ఎమ్మెల్యే
మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని వెల్లడి
కుత్బుల్లాపూర్, జూలై 7 ( నమస్తే భారత్ ): ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడమే ప్రజాప్రతినిధి బాధ్యత అని బిఆర్ఎస్ ఎల్పి విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. మంగళవారం 285వ పద్మానగర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్–2లో ఆయన సంబంధిత శాఖల అధికారులతో కలిసి విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ నెం.24లో సుమారు రూ.28 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా స్థానిక మహిళలు తాగునీటి సరఫరాలో లో-ప్రెషర్ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తెలంగాణ చౌరస్తా వద్ద రోడ్డుపై నిత్యం మురుగునీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు వివరించారు. సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ మాట్లాడుతూ, ప్రతి కాలనీకి నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులను మరింత మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ చౌరస్తాలో మురుగునీరు ఓవర్ఫ్లో కాకుండా నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ అభిరామ్, వాటర్ వర్క్స్ మేనేజర్ శివప్రసాద్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తి రెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, బొంబాయి శీను, రాకేష్ జాలిగం, మధుకర్ రెడ్డి, ఎం.డి. నజీరుద్దీన్, రమణారెడ్డి, ఆంజనేయులు, వెంకటేష్, దుర్గా రెడ్డి, కళ్లెం శ్రీనివాస్, కాలనీ ప్రతినిధులు శౌరి రాజ్, కేదార్ నాథ్, వెంకట్ సాయి, దశరథ్, రామ్ దాస్, సంతోష్, ఏలా నగేష్ తదితరులు పాల్గొన్నారు.