దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి

ప్రముఖ సామాజిక కార్యకర్త కాసుల రవికుమార్
నర్సంపేట ఆగష్టు10 (నమస్తే భారత్ ) :
దివ్యాంగులు సమాజంలో సమాన హక్కులు, గౌరవం, అవకాశాలతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం, సమాజం, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్తలు కాసుల రవికుమార్ శోభారాణిలుఅన్నారు.
ఖానాపురం మండలం పాకాల మీటింగ్ హాల్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ ( దివ్యాంగ) ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ దివ్యాంగులకు సమాన అవకాశాలు, సమాన భాగస్వామ్యం కల్పించే దిశగా ప్రభుత్వాలు మరింత సహకరించాలన్నారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అందుబాటు భౌతిక వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బిల్ల మహేందర్ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, ఉపాధి అవకాశాల పెంపు, విద్యా మరియు సామాజిక రంగాల్లో సమాన భాగస్వామ్యం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా లీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కులను తెలియజేసే పోస్టర్స్ ని ఆవిష్కరించారు.
అనంతరం గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేష సేవలందిస్తున్న కాసుల రవికుమార్ మరియు శోభారాణి సేవలను కొనియాడుతూ, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు వారికి జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కొల్లు నర్సమ్మ, పెండ్యాల రాధిక, ఆకవరపు స్వరూప, బొప్పి ఉమారాణి, అనుమల ధనంజేయి తదితరులు పాల్గొన్నారు.