ఎండిన చెట్టుతో కాలనీవాసుల్లో భయం.విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం
నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని సీతారాంపురం నాలుగో వార్డులో ఎండిపోయిన భారీ చెట్టు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. చెట్టు మధ్య భాగం గుండా మెయిన్ విద్యుత్ వైరు వెళ్లడంతో ఎప్పుడు కూలుతుందోనన్న ఆందోళనలో కాలనీవాసులు ఉన్నారు.ఈ సమస్యను నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ఎండిపోయిన చెట్టును తొలగించేందుకు ముందుగా మెయిన్ విద్యుత్ వైరును తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే గత వారం రోజులుగా విద్యుత్ శాఖ సిబ్బంది వివిధ కారణాలు చెబుతూ సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు.ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మెరుగు రాము మాట్లాడుతూ, విద్యుత్ వైరు తొలగించిన వెంటనే ప్రమాదకరంగా మారిన ఎండిన చెట్టును తొలగించవచ్చని తెలిపారు.అలాగే అక్కడే నిలిచిపోతున్న మురుగు నీటి సమస్యను నివారించేందుకు డ్రైనేజీ కాలువను కూడా మరమ్మతు చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రమాదం సంభవించేలోపే విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి మెయిన్ వైరును సురక్షితంగా తొలగించి, చెట్టును తొలగించేందుకు.సహకరించాలని, కాలనీవాసుల ప్రాణాలకు ముప్పు ఏర్పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.