డీజె లొద్దు రయ్య.. డిస్కోలనాడొద్దు..
సంప్రదాయ మెరిగి సంబరాల్ జెయ్యండి
నర్సంపేట సెప్టెంబర్ 13 (నమస్తే భారత్ ) :
వినాయకుడు లేకుండా ఏ పూజా లేదు, ఏ వ్రతమూ లేదు! సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్న నాధుడిని ఎంతో భక్తితో, సంప్రదాయ బద్ధంగా పూజించి, మర్యాదగా నిమజ్జన కార్యక్రమాలు జరిపించడం మానేసి, బొమ్మ ఊరిలోనికి తెచ్చేటప్పుడు మొదలెట్టిన బూతు డీజే పాటల దరువును బొమ్మను నిమజ్జనం చేసే దాకా కొనసాగించడం, అప్పుడప్పుడు ఆణిముత్యాల్లా నాలుగు భక్తి పాటలు, పంతులు గారు మంత్రాలు పూర్తి చేసిన వెంటనే డిస్కో పాటలు, ఇక ఊరేగింపుకి తాగుబోతు నాగినీ డాన్సులు, దేవుడికి సైతం చిరాకును, రోతనూ పుట్టించే ఊరేగింపు సన్నివేశాలు ఇవి కావురా ఆ గణపతికి మనం చెయ్యాల్సినది. మొదటగా మట్టి గణపతే పెట్టండి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు పెట్టవద్దు! సంప్రదాయ పద్ధతిలో రోజూ పూజా కార్యక్రమాలు, దీపారాధనలు, భజనలు, వీధిలోని ఆడవాళ్ళతో లలితా సహస్రనామాల పారాయణాలూ, కుంకుమ పూజలు, నిమజ్జనానికి వీధిలోని పిల్లలు, స్త్రీలతో కోలాటాలతో, భజనలతో ఊరేగింపులూ చేస్తే అత్యంత ఆనందదాయకంగా, సంస్కార వంతంగా ఉంటుంది, ఇతర మతస్తులు ఒక్క కామెంట్ కూడా చేయలేరు, నిర్వాహకులకు కూడా మంచి పేరు, గౌరవం, ఆ దేవుడి సంపూర్ణ అనుగ్రహం కలిగి, వారి జీవితాలలో మంచి రోజులు మొదలౌతాయి. అలా కాకుండా డీజేలతో హోరెత్తించి రోతపుట్టిస్తే పాపం తగిలి, జీవితాలు చంకనాకిపోతాయి, ఇతర మతాల వారు మనల్ని విమర్శించి, చులకన చేసి, దానినే చూపించి, యధేచ్ఛగా మతమార్పిడులు చేసుకుంటారు. మన ఊరి వాళ్ళు సైతం చందాలిచ్చి ప్రోత్సాహించినందుకు సిగ్గు పడతారు, మిమ్మల్ని తిట్టు కుంటారు. మీరు సంప్రదాయ బద్ధంగా కార్యక్రమాలు చేస్తే అందరికీ శుభాలు కలుగుతాయి. దయచేసి అర్దం చేసుకోండి.