NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 12:34 pm Posted by : NAMASTHE BHARAT

అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు.. అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హెచ్చరిక

అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు.. అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హెచ్చరిక

-కుత్బుల్లాపూర్ జోన్ ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం

-రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, పార్కుల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష

-వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన

-పనుల నాణ్యతలో రాజీ వద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

-ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని సూచించిన ఎమ్మెల్యే

-నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని వెల్లడి

కుత్బుల్లాపూర్, జులై 23 ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కుత్బుల్లాపూర్ జోన్ ఇంజనీరింగ్ శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమగ్రంగా చర్చించారు. నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న రహదారుల నిర్మాణం, విద్యుత్ సేవల మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం తదితర పనుల అమలు స్థితిని సమీక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు. పనుల అమలుపై క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో కుత్బుల్లాపూర్ జోన్ ఇంజనీరింగ్ శాఖతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.