NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 6:46 pm Posted by : NAMASTHE BHARAT

సర్వే నంబర్ 472 ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జాలకు అడ్డుకట్ట

సర్వే నంబర్ 472 ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జాలకు అడ్డుకట్ట

➤ ఎంఆర్ఓకు ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి అధికారులు.. మూడు అక్రమ బేస్‌మెంట్‌ల తొలగింపు

➤ హౌసింగ్ బోర్డు కోసం
కేటాయించిన 20 ఎకరాల భూమిని రక్షించాలని ఆకుల సతీష్ విజ్ఞప్తి

➤ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్

➤ హౌసింగ్ బోర్డు అధికారులతో కలిసి జాయింట్ సర్వే నిర్వహిస్తామని ఎంఆర్ఓ హామీ

దుండిగల్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): సర్వే నంబర్ 472లో హౌసింగ్ బోర్డు కోసం కేటాయించిన సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి వెంచర్‌గా అభివృద్ధి చేస్తూ అమాయక ప్రజలకు ప్లాట్ల పేరుతో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ ఆకుల సతీష్ దుండిగల్ మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ) రాజేశ్వర్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించి, అక్రమ కబ్జాలను అరికట్టాలని ఆయన కోరారు. ఆకుల సతీష్ మాట్లాడుతూ, ఇదే ప్రభుత్వ భూమిపై 2024లో కూడా అక్రమ కబ్జాల ప్రయత్నాలు జరిగాయని, అప్పట్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు. అయితే అనంతరం భూమికి శాశ్వత ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయి వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అమాయక ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, భూమికి శాశ్వత ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి కబ్జాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓను కోరినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించిన దుండిగల్ ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డి రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మూడు బేస్‌మెంట్‌లను తొలగించే చర్యలను ప్రారంభించారు. అలాగే హౌసింగ్ బోర్డు అధికారులతో కలిసి త్వరలో జాయింట్ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి హద్దులను ఖరారు చేసి, పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు ప్రారంభించిన దుండిగల్ ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డికి ఆకుల సతీష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు ఇదే విధమైన అప్రమత్తతతో వ్యవహరించాలని ఆయన కోరారు.