పోలీసులకు ఆర్థిక భద్రతపై అవగాహన
జీడిమెట్లలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సదస్సు
పొదుపు, పెట్టుబడులపై నిపుణుల సూచనలు
సిబ్బంది సందేహాలకు సమగ్ర సమాధానాలు
ఆర్థిక క్రమశిక్షణతోనే భవిష్యత్ భద్రత : ఏసీపీ బాల గంగిరెడ్డి

జీడిమెట్ల, జూన్ 20 ( నమస్తే భరత్ ):
పోలీస్ సిబ్బంది ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు భవిష్యత్ అవసరాలకు సన్నద్ధంగా ఉండేలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, హోంగార్డుల కోసం శనివారం జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ కౌశిక్ మరిడి ముఖ్య వక్తగా పాల్గొని ఆర్థిక ప్రణాళిక, పొదుపు, పెట్టుబడుల ప్రాముఖ్యతపై విస్తృతంగా వివరించారు. నెలవారీ వేతనంలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయడం, ఆ మొత్తాన్ని సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడుల్లో మళ్లించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ ఆర్థిక నిర్వహణ పద్ధతులను వివరించి, సిబ్బంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగిరెడ్డి మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది తమ విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపై కూడా అవగాహన పెంపొందించుకోవడం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక ద్వారా కుటుంబ భవిష్యత్తును మరింత భద్రంగా తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. సదస్సులో కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం పోలీస్ సిబ్బందిలో ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించి, భవిష్యత్ ఆర్థిక ప్రణాళికకు దోహదపడుతుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
