ఎర్రగడ్డ రైతు బజార్లో ప్లాస్టిక్ సంచులకు చెక్.. క్లాత్ బ్యాగుల వినియోగానికి శ్రీకారం
-ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యమని పిలుపు
-ఉచితంగా క్లాత్ బ్యాగుల పంపిణీ
యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన
-ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని సూచన
-వ్యాపారులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి
-“మనం మారితే.. మన ఊరు మారుతుంది” అంటూ సందేశం
కుత్బుల్లాపూర్, జులై 6 ( నమస్తే భారత్) పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఎర్రగడ్డ రైతు బజార్లో ఆదివారం “ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధం – క్లాత్ బ్యాగ్ వినియోగం”పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిరోధించి, వస్త్ర సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్ వి. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతోందన్నారు. ముఖ్యంగా యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా రైతు బజార్కు వచ్చిన వినియోగదారులకు ఉచితంగా క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర సంచులను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. కూరగాయలు, పండ్ల విక్రయదారులు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తిరుపతి రెడ్డి కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా నేల, నీరు కలుషితమవడంతో పాటు మురుగు కాల్వలు మూసుకుపోయి పర్యావరణ సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నాయని తెలిపారు.
కిరోసిన్ ఆధారిత ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాలు తీసుకెళ్లడం వల్ల హానికర రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉందని, ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ అన్నెం కోటిరెడ్డి, పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ లయన్ అమరేందర్ రెడ్డి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
చివరగా “మనం మారితే… మన ఊరు మారుతుంది” అనే సందేశంతో ప్రతి కుటుంబం ప్లాస్టిక్కు స్వస్తి పలికి, క్లాత్ బ్యాగుల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.