హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం: కేపీ
ఫోర్త్ సిటీ ప్రచారంలో ఉన్న నగర సమస్యలను పక్కన పెట్టారని విమర్శ
సుచిత్ర–కొంపల్లి ఫ్లైఓవర్ పనుల జాప్యంపై ఆగ్రహం
బాచుపల్లి ఫ్లైఓవర్ సహా నగర అభివృద్ధి ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వ్యాఖ్య
పేర్లు మార్చడం తప్ప కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు కనిపించడం లేదని ఆరోపణ
ప్రజల అవసరాల కంటే ప్రచార కార్యక్రమాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని విమర్శ
కుత్బుల్లాపూర్, జూన్ 9: ( నమస్తే భరత్); హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కొత్త ప్రాజెక్టుల ప్రకటనలకే పరిమితమై ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. సీఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్ను సోమవారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాచుపల్లి ఫ్లైఓవర్తో పాటు హైదరాబాద్ నగరంలో చేపట్టిన అనేక కీలక అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రారంభించిన పనులను పూర్తి చేసి ప్రారంభించడం మినహా కొత్తగా చేపట్టిన ప్రధాన అభివృద్ధి కార్యక్రమం ఏదీ కనిపించడం లేదన్నారు. అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రశ్నించిన ఫలితంగానే బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతమై ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రజల ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. ఫోర్త్ సిటీ పేరుతో కొత్త నగర నిర్మాణంపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోందని, అయితే ఇప్పటికే ఉన్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, పెండింగ్ ప్రాజెక్టుల సమస్యలను విస్మరిస్తోందని ఆరోపించారు. నగరాభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా సుచిత్ర–కొంపల్లి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. పనుల జాప్యానికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం కేంద్రంపై నెపం నెట్టడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రస్తుతం హెచ్-సిటీ పేరుతో కొత్త ముద్ర వేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని ఆరోపించారు. పేర్లు మార్చడం ద్వారా ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కంటే ప్రచార కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రజల అవసరాలు, నగర సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర ప్రయోజనాలను కాపాడగల రాజకీయ శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

