ముర్రుపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరం

: సీడీపీఓ మధురిమ
ఖానాపురం ఆగష్టు7 (నమస్తే భారత్ ) :
బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని, మొదట వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని ఐసీడీఎస్ నర్సంపేట ప్రాజెక్ట్ సీడీపీఓ మధురిమ , ఖానాపురం ఎంపీడీఓ అధ్వైత అన్నారు.
ఖానాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దాసరి రమేష్ అద్యక్షతన గర్భిణీ స్త్రీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఏడుగురుగర్భిణిలకు సీమంతం,ముగ్గురు చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అనంతరం సీడీపీఓ మధురిమ మాట్లాడుతూ ముర్రుపాలలో ఉండే పోషకాలు, రక్షణ పదార్థాలు శిశువు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయని వివరించారు. అందువల్ల శిశువుకు తల్లిపాలే ఇవ్వాలని, అవసరం లేకుండా డబ్బా పాలు ఇవ్వకూడదని తల్లులకు సూచించారు.అలాగే బిడ్డకు ఆరు నెలలు పూర్తయిన తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారం అందించాలని, అదనపు ఆహారాన్ని ఏ విధంగా, ఎంత మోతాదులో ఇవ్వాలో తల్లులకు అవగాహన కల్పించారు. బిడ్డ ఆరోగ్యానికి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు.
ఎంపీడీఓ అద్వైత మాట్లాడుతూ గర్భిణీలు గర్భధారణ సమయంలో అన్ని వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.ప్రసవానంతర మానసిక ఒత్తిడిని అధిగమించే మార్గాలు, తల్లి పాలివ్వాల్సిన సరైన విధానం, తల్లిపాల వల్ల శిశువుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. తల్లి ఆరోగ్యం, శిశువు ఎదుగుదల పరస్పర అనుబంధమై ఉంటాయని వివరించారు.సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ గర్భిణీలు ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సురక్షిత ప్రసవానికి అవసరమైన జాగ్రత్తలు వివరించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ మధురిమ, సీహెచ్ఓ దామోదర్ రెడ్డి, ఏసీడీపీఓ జ్యోతి, ఖానాపురం మండలంలోని అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.