పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలి మెట్టు
-లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్నగర్ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ
-దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
-పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ఎమ్మెల్యే పిలుపు
-చెత్త సమస్యలపై వెంటనే జీహెచ్ఎంసీకి సమాచారం ఇవ్వాలని సూచన
-పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని కోటిరెడ్డి వ్యాఖ్య
కుత్బుల్లాపూర్, జూలై 7 నమస్తే భరత్ :ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్నగర్ ఆధ్వర్యంలో రూపొందించిన “మన పరిసరాలు – మన శుభ్రత” గోడపత్రికను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గోడపత్రికను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పరిశుభ్రమైన పరిసరాలే పునాది అని అన్నారు. మన ఇల్లు, వీధి, కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ లయన్ అన్నెం కోటిరెడ్డి మాట్లాడుతూ, కాలనీల్లో చెత్త పేరుకుపోయినట్లు గమనిస్తే వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అదే సమయంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, ఇంటి పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ భువనేశ్వర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, సత్యనారాయణతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత చైతన్యం కల్పించాలనే లక్ష్యాన్ని నిర్వాహకులు వెల్లడించారు.