జంతర్ మంతర్ లో జర్నలిస్టుల ధర్నాకు స్పందించిన కేంద్రం

టీడబ్ల్యూజేఎఫ్ వినతిపై చర్యలు ప్రారంభం
ప్రెస్ కౌన్సిల్కు కేంద్ర సమాచార,ప్రసారాల శాఖ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే భారత్ )
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జూలై 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించిన జర్నలిస్టుల ధర్నా పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రం పై చర్యలు ప్రారంభమయ్యాయి. జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత,చట్టపరమైన రక్షణ తదితర అంశాలపై టీడబ్ల్యూజేఎఫ్ ప్రధానమంత్రి కార్యాలయానికి వినతిపత్రం సమర్పించింది. ఈ వినతి పత్రంలో అక్రెడేటెడ్ జర్నలిస్టులకు 50 శాతం రైల్వే ఛార్జీ రాయితీ, ఆన్లైన్ టికెట్ బుకింగ్ పునరుద్ధరణ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యకు చట్టపరమైన పరిష్కారం, స్వతంత్ర నేషనల్ మీడియా కమిషన్ ఏర్పాటు, వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని పునరుద్ధరించడం/సవరణలు చేయడం, జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం, ప్రింట్,ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియా ఉద్యోగులకు రక్షణ, కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు, జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం తదితర డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వినతిపై PMOPG/D/2026/0139147 నంబరుతో జూలై 28న ఫిర్యాదు నమోదు కాగా, సంబంధిత అంశాన్ని పరిశీలించేందుకు మీడియా యూనిట్ సెల్–Iకి బదిలీ చేసినట్లు రిజిస్ట్రేషన్ వివరాల్లో నమోదైంది.
మరో కీలక పరిణామంగా, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి 2026 ఆగస్టు 8న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కార్యదర్శికి అధికారిక లేఖ జారీ అయింది. టీడబ్ల్యూజేఎఫ్ తరఫున సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సమర్పించిన ఫిర్యాదు ను ప్రస్తావిస్తూ, జర్నలిస్టుల సంక్షేమం, సేవా పరిస్థితులు, చట్టపరమైన రక్షణ, సామాజిక భద్రత, కార్మిక హక్కులకు సంబంధించిన అంశాలపై తగిన చర్యలు తీసుకుని, ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. తమ విజ్ఞప్తి మేరకు రైల్వే రాయితీ విషయం పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా స్పందించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని మామిడి సోమయ్య కోరారు.