NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 9:16 pm Posted by : NAMASTHE BHARAT

నిరుద్యోగ యువతకు ఉపాధి బాటలు!

నిరుద్యోగ యువతకు ఉపాధి బాటలు!

తెలంగాణ ఉపాధి పోర్టల్‌లో తప్పనిసరి నమోదు

మెద్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఉపాధి అధికారి సూచన

కుత్బుల్లాపూర్, ఆగస్టు 11: ( నమస్తే భరత్ ); పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మెద్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు జిల్లా ఉపాధి శాఖ చర్యలు చేపడుతోంది. జిల్లాలో అనేక పరిశ్రమలు, ఐటీ సంస్థలు, లాజిస్టిక్స్‌, ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అర్హత కలిగిన యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు.

ఉపాధి పోర్టల్‌లో నమోదు తప్పనిసరి
జిల్లాలోని నిరుద్యోగ యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలు, ఇతర వివరాలను తెలంగాణ ఉపాధి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారం యువతకు చేరడంతో పాటు, అర్హులైన అభ్యర్థులను ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేసేందుకు ఈ నమోదు ఉపయోగపడుతుందని తెలిపారు.

జాబ్‌ మేళాలకు ప్రాధాన్యం
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా సంస్థల్లోని ఖాళీలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

యువతకు చేరువగా ఉపాధి సేవలు
ఉపాధి కార్యాలయ సేవలను మరింత విస్తృతంగా యువతకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. జిల్లాలో నిర్వహించే వివిధ ఉద్యోగ మేళాలు, నియామక ప్రక్రియల వివరాలను నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

విద్యార్హతల ఆధారంగా అవకాశాలు
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు అనుగుణంగా యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా SSC, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఐటీఐ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇలా నమోదు చేసుకోవచ్చు
నిరుద్యోగ యువత www.employment.telangana.gov.in వెబ్‌సైట్‌లో Job Seekers Login ద్వారా క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు. పోర్టల్‌లో నమోదు అనంతరం అందుబాటులోకి వచ్చే ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మేళాల సమాచారాన్ని పరిశీలిస్తూ అర్హతకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.