NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:30 pm Posted by : NAMASTHE BHARAT

చదువుల గూటిలో దాడులా?.. విద్యార్థిపై ఘటనతో యూఎస్ఎఫ్ఐ ఆగ్రహం

చదువుల గూటిలో దాడులా?.. విద్యార్థిపై ఘటనతో యూఎస్ఎఫ్ఐ ఆగ్రహం

దమ్మాయిగూడ శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థిపై దాడి ఆరోపణలు

ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడటం దారుణమని ఆక్షేపణ

విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యాలు బాధ్యత వహించాలని డిమాండ్

ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

బాధిత విద్యార్థికి మెరుగైన వైద్యం, నష్టపరిహారం అందించాలని కోరిన యూఎస్ఎఫ్ఐ

కార్పొరేట్ పాఠశాలల్లో ర్యాగింగ్ నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్

కుత్బుల్లాపూర్, ఆగస్టు 10 ( నమస్తే భరత్ ): దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థి అభిషేక్‌పై ర్యాగింగ్ పేరుతో దాడి జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. విద్యార్థిపై దాడి ఘటనను యూఎస్ఎఫ్ఐ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థిని కర్రలతో కొట్టడంతో పాటు కాళ్లతో తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయని యూఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఘటనలో విద్యార్థి గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన విద్యాసంస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని అన్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థిపై దాడికి సంబంధించిన ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల భద్రతకు పటిష్ఠ చర్యలు అవసరం
మంచి విద్య అందుతుందనే నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని, విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని యూఎస్ఎఫ్ఐ పేర్కొంది. పాఠశాలల్లో ర్యాగింగ్, వేధింపులు, దాడులను అరికట్టేందుకు పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

ప్రత్యేక చట్టం తేవాలి
కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులపై ర్యాగింగ్, వేధింపులు, దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే విద్యాసంస్థలపై బాధ్యత నిర్ణయించి చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలని కోరింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎం. చంద్రకాంత్ హెచ్చరించారు.