NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:09 pm Posted by : NAMASTHE BHARAT

పూర్వ విద్యార్థి సేవాభావం.. పాఠశాలకు భద్రతా కవచం!

పూర్వ విద్యార్థి సేవాభావం.. పాఠశాలకు భద్రతా కవచం!

→ రూ.2 లక్షలతో 20 సీసీ కెమెరాల ఏర్పాటు

→ జీడిమెట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు భద్రతా భరోసా

→ విద్యార్థుల రక్షణకు నిరంతర నిఘా

→ పాఠశాల ఆస్తుల పరిరక్షణకు కెమెరాలు
C
→ ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు ఉండాలి: ఏసీపీ

→ క్రాంతి కిరణ్‌ సేవాభావాన్ని అభినందించిన అధికారులు

జీడిమెట్ల, ఆగస్టు 14: (నమస్తే భారత్); చదువుకున్న పాఠశాలపై ఉన్న మమకారాన్ని ఓ పూర్వ విద్యార్థి సేవా కార్యక్రమం ద్వారా చాటుకున్నారు. జీడిమెట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల భద్రత, పాఠశాల ఆస్తుల పరిరక్షణ కోసం పూర్వ విద్యార్థి ఏరోళ్ల క్రాంతి కిరణ్ సుమారు రూ.2 లక్షల సొంత నిధులతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉండేలా వీటిని ఏర్పాటు చేయడం పట్ల పాఠశాల సిబ్బంది, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రారంభించిన ఏసీపీ, ఎస్‌హెచ్ఓ
సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేడ్చల్–పేట్‌బషీరాబాద్ ఏసీపీ శంకర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ విజయ్‌వర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరై కెమెరాల సీసీటీవీ కెమెరాలు ప్రారంభించారు.

భద్రతకు ఎంతో దోహదం

ఈ సందర్భంగా ఏసీపీ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు విద్యార్థుల భద్రతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పూర్వ విద్యార్థి క్రాంతి కిరణ్ రూ.2 లక్షలతో 20 కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు నిరంతర నిఘా ఉంచేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి పాఠశాలలో కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఆస్తులకూ రక్షణ

ఎస్‌హెచ్ఓ విజయ్‌వర్ధన్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతతో పాటు పాఠశాల ఆస్తుల పరిరక్షణకు కూడా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తాను చదువుకున్న పాఠశాలకు రూ.2 లక్షల విలువైన సీసీ కెమెరాల వ్యవస్థను అందించడం ద్వారా క్రాంతి కిరణ్ సామాజిక బాధ్యతను చాటుకున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా అధికారులు, పాఠశాల సిబ్బంది ఆయనను అభినందించారు.