ఘనంగా పోషణ మాసం కార్యక్రమం
నమస్తే భారత్ :-నెల్లికుదురు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఐసీడీఎస్ తొర్రూర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మేచరాజుపల్లి సెక్టార్ పరిధిలోని బాడవ తండా అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ పద్మ మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు, గుడ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని వివరించారు.
అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం, పరిశుభ్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, తల్లులు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.