కలలకు రెక్కలు తొడిగిన దంపతులు.. ప్రతిభావంతులైన విద్యార్థులకు తొలి విమానయానం
-జీడిమెట్ల ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్–లెక్చరర్ సుశీల దంపతుల వినూత్న సేవ
-బిక్నూర్ జెడ్పీహెచ్ఎస్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు అరుదైన అవకాశం
-‘బ్యాక్ టు బ్యాక్ (B2B)’ కాన్సెప్ట్తో భిక్కనూరు నుంచి బెంగళూరుకు విద్యా విహారం
-తొలి విమాన ప్రయాణంతో విద్యార్థుల్లో నూతన ఆత్మవిశ్వాసం
-బెంగళూరులో ప్రముఖ ప్రదేశాల సందర్శనతో విస్తృత అవగాహన
-“భవిష్యత్ తరానికి మన వంతు చేయూత అందించాలనే సంకల్పమే మా లక్ష్యం” – ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్
జీడిమెట్ల, జులై 12 ( నమస్తే భరత్ ); సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్కు కొత్త దారులు చూపించే అరుదైన కార్యక్రమాన్ని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్, లెక్చరర్ సుశీల దంపతులు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు వంశీక, సహస్ర, మహేష్, నౌషిన్, జంగంపల్లి స్పందనలకు జీవితంలో మరపురాని అనుభూతిని అందించారు. ‘బ్యాక్ టు బ్యాక్ (B2B)’ కాన్సెప్ట్లో భాగంగా ఈ విద్యార్థులను భిక్కనూరు నుంచి బెంగళూరుకు విమానంలో తీసుకెళ్లి, అక్కడి ప్రముఖ పర్యాటక, విద్యా, విజ్ఞాన కేంద్రాలను సందర్శింపజేశారు. తొలిసారి విమాన ప్రయాణం చేసిన విద్యార్థులు ఆనందోత్సాహాలతో మురిసిపోయారు. ఈ కార్యక్రమం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, ఉన్నత లక్ష్యాల సాధనకు మరింత ప్రేరణనిచ్చిందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, “సమాజంలో మనం ఎదిగిన తర్వాత మనలాంటి తదుపరి తరానికి కూడా చేయూత అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత గా తీసుకోవాలన్నారు. విద్యార్థులు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అని తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాతలు అని పేర్కొన్నారు. వారి కలలకు రెక్కలు తొడగడమే మా సంకల్పం” అని చెప్పారు. ఈ వినూత్న కార్యక్రమంపై స్థానికులు, విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, గడ్డం మల్లేష్–సుశీల దంపతుల సేవాభావాన్ని ప్రశంసించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ, విద్యార్థుల్లో ఉన్నత ఆశయాలను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.