NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 11:54 am Posted by : NAMASTHE BHARAT

టీబీ ముక్త్ భారత్‌కు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి

టీబీ ముక్త్ భారత్‌కు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి

జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

వరంగల్ జూలై 3 (నమస్తే భారత్ ) :
వరంగల్ జిల్లాలో టీబీ నిర్మూలన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ జాతీయ కార్యక్రమాల అమలు, ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. జిల్లాను “టీబీ ముక్త్ భారత్” లక్ష్య సాధన దిశగా తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. హెచ్‌ఐవీ బాధితులు, మధుమేహం, రక్తపోటు రోగులు, టీబీ రోగుల సన్నిహితులకు తప్పనిసరిగా టీబీ నిర్ధారణ పరీక్షలు, తెమడ పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రేలు నిర్వహించాలని, అలాగే హెచ్‌ఐవీ పరీక్షలను కూడా విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల పనితీరును జిల్లా స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులను మాత్రమే నిల్వ ఉంచి, రోగుల అవసరాలకు అనుగుణంగా మందుల వినియోగం ఉండేలా చూసి వృథాను నివారించాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రోగ్రామ్ అధికారులు క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించి, లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. జిల్లాలో వివిధ దశల్లో కొనసాగుతున్న ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌వో డా. ఐ. ప్రకాష్, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ ప్రసాద్, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.