భవన నిర్మాణ కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలి
పనికి తగ్గ వేతనాలు, సంక్షేమ చర్యలు అవసరం
కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తా : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, జూన్ 9 ( నమస్తే భరత్ ) : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు లభించడంతో పాటు వారి పనికి తగ్గ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ సుభాష్ నగర్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వినతిపత్రం ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న జీవన వ్యయం, నిర్మాణ రంగంలో మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికి పనికి తగిన వేతనాలు, సామాజిక భద్రతా సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. కార్మికుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్మిక సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ సుభాష్ నగర్ కమిటీ అధ్యక్షుడు పి. శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పి. వెంకయ్య, కార్యదర్శి వి. శ్రీనివాస్, యూనియన్ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
