NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 11:40 am Posted by : NAMASTHE BHARAT

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ మెరుగ్గా ఉండేది: కేటీఆర్

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ మెరుగ్గా ఉండేది: కేటీఆర్

కొంపల్లి శ్వేతశుభం రెసిడెన్సీ వాసుల సమస్యలపై స్పందన

త్రాగునీటి సరఫరా, ట్రాఫిక్ కష్టాలను వివరించిన ఐటీ ఉద్యోగులు

నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాలన్న విజ్ఞప్తి

ఉత్తర హైదరాబాద్‌కు మెట్రో విస్తరణ సాధిస్తామని హామీ

కొంపల్లి, జూన్ 12 ( నమస్తే భరత్ ); :కొంపల్లి పరిధిలోని శ్వేతశుభం రెసిడెన్సీకి చెందిన ఐటీ ఉద్యోగులు, నివాసితులు శుక్రవారం బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నివాసితులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రోజు విడిచి రోజు త్రాగునీటి సరఫరా జరిగేదని, ప్రస్తుతం ఐదు రోజులకోసారి కూడా తక్కువ ఒత్తిడితో నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గృహ అవసరాలు తీర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే బోయిన్‌పల్లి–సుచిత్ర–కొంపల్లి–మేడ్చల్ మార్గంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పర్యవేక్షణ లోపంతో గత రెండేళ్లుగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఫలితంగా రోజువారీ ప్రయాణాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మెట్రో రైలు విస్తరణలో భాగంగా కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు మెట్రో సేవలను విస్తరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని నివాసితులు తెలిపారు. ఉత్తర హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అసెంబ్లీలోనూ, ఇతర వేదికలపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ స్పందన కనిపించడం లేదని తెలిపారు. నివాసితుల సమస్యలను విన్న కేటీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, నగరాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దామని అన్నారు. అయితే ప్రస్తుతం మౌలిక సదుపాయాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. శ్వేతశుభం రెసిడెన్సీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. త్రాగునీటి సరఫరా సమస్య పరిష్కారంతో పాటు నిలిచిపోయిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పునఃప్రారంభం అయ్యేలా కృషి చేస్తామని, ఉత్తర హైదరాబాద్‌కు మెట్రో విస్తరణ సాధించే దిశగా ఉద్యమిస్తామని తెలిపారు.