NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 8:58 pm Posted by : NAMASTHE BHARAT

బీఆర్ఎస్సీవీ నాయకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై నిరసన

బీఆర్ఎస్సీవీ నాయకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై నిరసన

ఎటువంటి కార్యక్రమం లేకపోయినా నిర్బంధించారని కొర్ర ప్రవీణ్ నాయక్ ఆరోపణ

విద్యార్థి నాయకుల వేధింపులు ఆపాలని ప్రభుత్వానికి డిమాండ్

కుత్బుల్లాపూర్, జూన్ 18 నమస్తే భరత్: ఎటువంటి ముట్టడులు, ధర్నాలు లేదా రాజకీయ పార్టీ కార్యక్రమాలు లేకపోయినా బీఆర్ఎస్సీవీ నాయకుడు కొర్ర ప్రవీణ్ నాయక్‌ను పోలీసులు గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న నాయకులపై కేసులు నమోదు చేయడం, వారిని తరచూ పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, వేధింపులకు గురిచేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎటువంటి కార్యక్రమాలు లేని రోజున కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం అన్యాయమని విమర్శించారు. విద్యార్థుల హక్కులు, విద్యా సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులను అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం కంటే విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్సీవీ నాయకులు, కార్యకర్తలపై నమోదవుతున్న కేసులు, వేధింపులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్బంధాలు, తప్పుడు కేసుల రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్సీవీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కొర్ర ప్రవీణ్ నాయక్ కోరారు.