NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 12:14 pm Posted by : NAMASTHE BHARAT

ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే యూనిఫాంలు పంపిణీ చేయాలి

ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే యూనిఫాంలు పంపిణీ చేయాలి

 

జగద్గిరిగుట్ట జెడ్పీ ఉన్నత పాఠశాల పరిశీలనలో సీపీఐ నేతల డిమాండ్

• పాఠశాలలు ప్రారంభానికి ముందే విద్యార్థులకు దుస్తులు అందించాలని విజ్ఞప్తి

• జీవశాస్త్ర ఉపాధ్యాయుల కొరతతో బోధనకు ఆటంకం

• పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరం

• ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన

జగద్గిరిగుట్ట, జూన్ 12 ( నమస్తే భరత్ ): ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన యూనిఫాంలు ఇప్పటికీ పంపిణీ కాకపోవడం ఆందోళనకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని తెలుసుకునేందుకు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జగద్గిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పార్టీ నాయకుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను పరిశీలించిన అనంతరం ఉమా మహేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే అవసరమైన బోధన సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లేకపోవడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలలో పారిశుద్ధ్య సమస్యలు ఉన్నట్లు తమ పరిశీలనలో గుర్తించామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులకు యూనిఫాంలను తక్షణమే పంపిణీ చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి ఎం. సహదేవరెడ్డి, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు బాబు, సీపీఐ నాయకులు కృష్ణ, శ్రీనివాస్ చారి, యువజన నాయకులు కార్తీక్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.