NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 11:45 am Posted by : NAMASTHE BHARAT

ప్రజలకు సత్వర సేవలందించడమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ అంకిత్

ప్రజలకు సత్వర సేవలందించడమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ అంకిత్


నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)

 

ఐ డి ఓ సి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్ఓ పద్మావతితో కలిసి ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, రెవెన్యూ మరియు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల సమస్యలను కేవలం నమోదు చేయడం కాకుండా, వాటి పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు.
శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేదా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వ సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పించడం ద్వారా సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని అన్నారు . ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించడం లక్ష్యమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.

*ప్రజావాణిలో అందిన కొన్ని వినతులు:*

టేకులపల్లి మండలం మొక్కంపాడు తండాకు చెందిన భూక్య సుమన్ తాను జన్మతః దివ్యాంగుడినని, అద్దె ఇంటిలో నివసిస్తూ జీవనం సాగించడం కష్టతరంగా మారిందని, ఇందిరమ్మ గృహం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తదుపరి చర్యల కోసం గృహ నిర్మాణ శాఖ పీడీకి ఎండార్స్ చేశారు. మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామానికి చెందిన బట్ట కృష్ణవేణి తన కుమార్తె దివ్యశ్రీ ఆరో తరగతి ప్రవేశం కోసం గురుకుల ప్రవేశ పరీక్ష రాసినప్పటికీ సీటు రాలేదని, తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్థోమత లేదని పేర్కొంటూ గురుకుల పాఠశాలలో సీటు మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. దీనిపై తగు చర్యల కోసం ఆర్‌సీఓ, సోషల్ వెల్ఫేర్‌కు ఎండార్స్ చేశారు.
సుజాతనగర్ మండలం చిమ్న తండా గ్రామానికి చెందిన భూక్య సేవ తన తండ్రి 2010లో మరణించారని, మరణ ధ్రువీకరణ పత్రం కోసం పలుమార్లు మీ సేవలో దరఖాస్తు చేసినప్పటికీ తిరస్కరణకు గురవుతోందని తెలిపారు. ఈ కారణంగా తన తండ్రి పేరిట ఉన్న భూమిని తన పేరుపై మార్చుకోలేకపోతున్నానని, సమస్య పరిష్కరించి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల కోసం సుజాతనగర్ తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.
ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన స్వప్న తనకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, పూర్తిగా వర్షాధార సాగుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నానని, బోరు మరియు విద్యుత్ సదుపాయం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ తదుపరి చర్యల కోసం ఐటీడీఏ పీవోకు ఎండార్స్ చేశారు.
ఇల్లందు మండలం ధనియాలపాడు గ్రామ పరిధిలోని బాలాజీ తండాకు చెందిన భానోత్ అనూష తనకు సంబంధించిన రెండు వేర్వేరు భూముల భూభారతి రిజిస్ట్రేషన్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తగు చర్యల కోసం సంబంధిత ధరణి అధికారులకు ఎండార్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.