NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 9:09 am Posted by : NAMASTHE BHARAT

ధరల పెంపుతో దేశంలో ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

ధరల పెంపుతో దేశంలో ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ

వరంగల్ జూన్ 9 (నమస్తే భారత్ ) :

అంతర్జాతీయ మార్కెట్ నెపంతో కేవలం ఒకే నెలలో పలుమార్లు ఇంధన ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడం దుర్మార్గమని
పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు.
పెంచిన గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో గాంధి భవన్ నుండి గన్ పార్క్ వరకు మహా నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా 4 సార్లు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై ఈ విధంగా ధరల భారం మోపడం అత్యంత దారుణమన్నారు.కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ వల్లనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చమురు సంస్థలపై ఒత్తిడి తీసుకురావడం లేదు.ఎన్నికలకు ముందు ఒక మాటా, ఎన్నికలు అయిపోయాక ఇంకో మాటా ? ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనం. ఈ సుంకాన్ని వెంటనే తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాలి.అంతర్జాతీయ మార్కెట్ నెపంతో కేవలం ఒకే నెలలో పలుమార్లు ఇంధన ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడం దుర్మార్గం.
నాడు కాంగ్రెస్ హయాంలో గ్యాస్ ధర కొద్దిగా పెరిగితేనే రోడ్లపైకి వచ్చి నాటకాలు ఆడిన నాయకులు.. ఈరోజు ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఎక్కడ దాక్కున్నారు? అని నేను అడుగుతున్నాను.
ఇంధన ధరలు పెరగడం అంటే కేవలం వాహనాల ఖర్చు పెరగడం కాదు.. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పులు, ఉప్పుల ధరలు కూడా అమాంతం పెరిగిపోవడం.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువుపై పన్నులు బాదుతూ, ధరలు పెంచుతూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు.కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. సామాన్య మహిళల ఓట్లతో గద్దెనెక్కి.. అదే మహిళల వంటింటి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రజల రక్తాన్ని పిండుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది చేతకాని వాళ్లు కాదు.. వీరు తెలంగాణ మహిళా కాంగ్రెస్ సింహాలు!
మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, ‘మహాలక్ష్మి పథకం’ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఆదుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుతూ మహిళల నడ్డి విరుస్తోంది.గతంలో కాంగ్రెస్ హయాంలో సిలిండర్ ధర తక్కువగా ఉంటేనే నాడు నానా యాగి చేసిన బీజేపీ నాయకులు, ఇప్పుడు ధరలు వెయ్యి రూపాయలు దాటినా నోరు మెదపకపోవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, బడా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన ధరలను తగ్గించకపోతే మహిళల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటాలు ఉధృతం చేస్తాం. మహిళా శక్తి ఏంటో కేంద్ర ప్రభుత్వానికి చూపిస్తామని ఎర్రబెల్లి స్వర్ణ హెచ్చరించారు.ఈకార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కార్యవర్గ కమిటీ సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకులు , మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.