టీబీ నిర్ధారణ శిబిరం: 34 నమూనాల సేకరణ
* వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలల ఉచిత మందులు, పోషక సహాయం: వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) పరిధిలో శుక్రవారం ఉచిత టీబీ (క్షయ) వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. పీహెచ్ వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుండి ఆశా ఆరోగ్య కార్యకర్తల సహాయంతో ఈ క్యాంపును చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తుగా సర్వే నిర్వహించి, క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఈ శిబిరానికి తరలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ.శిబిరంలో మొత్తం 34 మంది అనుమానితుల నుండి నమూనాలను (శాంపిల్స్) సేకరించినట్లు తెలిపారు. ఈ శాంపిల్స్ను ఖచ్చితమైన నిర్ధారణ పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి పంపించామని పేర్కొన్నారు.పరీక్షల్లో టీబీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే, వారికి ప్రభుత్వం తరఫున 6 నెలల పాటు పూర్తిగా ఉచితంగా మందులు అందిస్తామని డాక్టర్ రవి స్పష్టం చేశారు. అంతేకాకుండా, రోగుల మెరుగైన పోషణ (న్యూట్రిషన్) కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక పారితోషికాన్ని కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రజలు టీబీ పట్ల అవగాహన కలిగి ఉండాలని, లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఆచార్యులు, ల్యాబ్ టెక్నీషియన్ (లెట్ ) అనిత, అనూష, హెల్త్ అసిస్టెంట్ నర్సయ్య మరియు మండల ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
