ఆపద నిర్వహణలో విశిష్ట సేవలకు నేతాజీ పురస్కారం
అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి నామినేషన్ల ఆహ్వానం
విపత్తు నిర్వహణలో విశేష కృషికి జాతీయ స్థాయి గుర్తింపు
స్వీయ, మూడవ పక్ష నామినేషన్లకు అవకాశం
ఏడాది పొడవునా జాతీయ పురస్కారాల వేదికలో దరఖాస్తుల స్వీకరణ
కొంపల్లి, జూన్ 12 ( నమస్తే భారత్ ): విపత్తు నిర్వహణ రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రదానం చేసే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద నిర్వహణ పురస్కారానికి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు కొంపల్లి సర్కిల్-56 డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటిస్తారని పేర్కొన్నారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన సిద్ధత, రక్షణ చర్యలు, సహాయక కార్యక్రమాలు, పునరావాసం, నివారణ, ప్రమాద ప్రభావాల తగ్గింపు, పరిశోధన, ఆవిష్కరణలు, సామర్థ్య వృద్ధి వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ పురస్కారం ద్వారా సత్కరిస్తారని తెలిపారు. వ్యక్తిగత విభాగంలో ప్రశంసా పత్రం, పతకం అందజేయగా, సంస్థాగత విభాగంలో ప్రశంసా పత్రం, ఫలకాన్ని ప్రదానం చేస్తారని వెల్లడించారు. నామినేషన్లు ఏడాది పొడవునా జాతీయ పురస్కారాల వేదిక ద్వారా స్వీకరిస్తారని, స్వీయ నామినేషన్లతో పాటు మూడవ పక్షం ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. విపత్తు నిర్వహణ రంగంలో విశేష కృషి చేసిన అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మీడియా ప్రతినిధులను డిప్యూటీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.